సాక్షిని చదవకండి, వారిసంగతి స్వామి చూస్తారు: బాబు
రాష్ట్రం తరఫున పది మంది కేంద్రమంత్రులు ఉన్నా నిధులు తీసుకు రావడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ నేతలు దోచుకోవడంలో ఇప్పుడు బిజీగా ఉన్నారన్నారు. కాంగ్రెసు నేతల కబంద హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.
టిడిపి అధికారంలోకి వస్తే రుణ మాఫీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా ప్రజలంతా కష్టాల్లో ఉన్నారన్నారు. కాంగ్రెసు కబ్జాల పార్టీ అని, కరెంట్ రాదు కానీ, నడ్డివిరిచేలా బిల్లు మాత్రం వస్తాయని ధ్వజమెత్తారు. టిడిపి హయాంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామన్నారు. టిడిపి హయాంలో అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగిందని చెప్పారు.
పెరిగిన ఆదాయం కాంగ్రెసు నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. మనదేం పోయిందని ఎవరూ అనుకోవద్దని, పోయింది ప్రజల సొమ్మే అన్నారు. అక్రమార్కులు బంగారమంతా కొనేసినందువల్ల ధరలు అధికంగా పెరుగుతున్నాయన్నారు. తిరుమల గిరులలో ఎర్ర చందనం దోపిడీని చేసేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తమ్ముళ్లను రంగంలోకి దించారన్నారు. తమ హయాంలో ఎర్ర చందనం మొక్కలు నాటిస్తే కాంగ్రెసు నేతలు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్నారు.
వారి సంగతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చూసుకుంటారని అన్నారు. మహిళలకు సమాన హక్కుల కోసం ఎన్టీఆర్ నాడే చట్టాలు తెచ్చారన్నారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలన్నారు. కిరణ్ చిత్తూరు జిల్లాకు చెడ్డపేరు తెస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల ఎర్ర చందనం దొంగతనాలు తిరుపతి వెంకన్నకు తెలుసన్నారు. కాంగ్రెసు నాయకులు భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సుల్లో విద్యార్థులకు తగిన శిక్షణ ఇప్పిస్తామన్నారు.
రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు
కాంగ్రెసు పార్టీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. రుణ మాఫీ అసాధ్యమని సిఎం అనడం హాస్యాస్పదమన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామన్న సచిన్ పైలట్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెసు సహకార ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. రాజకీయంగా రైతులే కాంగ్రెసును హత్య చేస్తారన్నారు. తమ హయాంలో కేంద్రంతో పోరాటి రుణ మాఫీ చేయించిన ఘనత బాబుదే అన్నారు.