జిహెచ్ఎంసి అధికారి లాకర్లో దిమ్మ తిరిగే నగదు
బ్యాంక్ లాకర్లో 60 లక్షల రూపాయల నగదు, 40 లక్షల డిపాజిట్ పత్రాలు, 400 గ్రాముల బంగారం బయటపడ్డాయి. కోట్లాది రూపాయల విలువ చేసే డిపాజిట్ పత్రాలను ఎసిబి అధికారులు ఇంతకు ముందు లాకర్లలో భద్రపరిచిన విషయాలను ఎసిబి అధికారులు చూసినప్పటికీ ఇంత పెద్ద మొత్తం నగదు లాకర్ నుంచి స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి.
కుప్పు నాయక్ బిల్లు క్లియర్ చేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి పెద్ద మొత్తం లంచం డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని చెల్లించలేక అతను ఎసిబికి ఫిర్యాదు చేశాడు. దాంతో ఎసిబి అధికారుల సూచన మేరకు 35 వేల రూపాయలు ఇవ్వడానికి కుప్పు నాయక్తో ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని ఇవ్వడానికి హైదరాబాదులోని సంతోష్నగర్లో గల ఓ థియేటర్ వద్దకు రావాలని కుప్పు నాయక్ కాంట్రాక్టర్కు చెప్పాడు.
ముందే నిర్ణయించుకున్న ప్రకారం కుప్పు నాయక్కు ఇటీవల కాంట్రాక్టర్ 35వేల రూపాయలు ఇస్తుండగా అక్కడికక్కడే ఎసిబి అధికారులు పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. కుప్పు నాయక్కు చెందిన మరిన్ని బ్యాంక్ లాకర్లను తెరిచేందుకు ఎసిబి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.