అక్కసుతో కోడలికి విషప్రయోగం, బాలుడి మృతి
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - మండల కేంద్రమైన పివిపాలెం గౌడపాలెంకు చెందిన బొలగాని ధర్మారావు పదేళ్ల క్రితం వెల్డింగ్ పనులు చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటూ తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూతురు పున్నాం అలియాస్ పూర్ణిమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భర్తతో పాటు పివి పాలెంలోని అత్తింటికి చేరుకున్న పూర్ణిమపై అత్త మంగమ్మ కోపం పెంచుకుని వేధించసాగింది. ఆ దంపతులకు జానకి అనే కుమార్తె, వినయ్ అనే కుమారుడు కలిగారు. అత్తింట్లో కష్టాలు పడుతున్న పూర్ణిమకు ఇది చాలదన్నట్లు భర్త ధర్మారావు 2012 డిసెంబర్లో మృతి చెందాడు.
భర్త మరణంతో పోషించే దిక్కు లేక పిల్లలను వెంట బెట్టుకుని ఢిల్లీలోని పుట్టింటికి చేరుకుంది. పూర్ణిమ దుస్థితిపై జాలిపడిన పివి పాలెంలోని స్థానికులు కొందరు ఆమెకు సహాయం చేస్తామని పివి పాలెం రప్పించారు. చందోలులోని మిల్లులో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఆమె పోషించుకుంటోంది. ఆ కుటుంబంపై జాలిపడిన గౌతులచ్చన్న యూత్ సభ్యులు పూర్ణిమ పిల్లలకు శనివారం 20 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. విషయం తెలుసుకున్న అత్త మంగమ్మ దాతలు ఇచ్చిన విరాళం సొమ్ము ఇవ్వమని అడిగింది. డబ్బులు ఇచ్చేందుకు పూర్ణిమ నిరాకరించడంతో మంగమ్మ కోడలు తినేందుకు దాచి ఉంచిన సాంబారులో గుళికలను కలిపింది.
విషం కలిపిన సంగతి తెలియయక కోడలు పూర్ణిమ, మనుమడు వినయ్ సాంబారు అన్నం తిన్నారు. ఆకలి లేకపోవడంతో బాలిక జానకి మాత్రం భోజనం చేయలేదు. విషం గుళికలు కలిపిన అన్నం తిన్న వినయ్ శనివారం రాత్రి వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. చికిత్సకు చెరుకుపల్లిలోని ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. కొడుకు మృతిచెందిన కొద్ది నిమిషాలకే పూర్ణిమ కూడా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు ఆమెను పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చందవోలు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.