ఉరితీత: రెండ్రోజుల తర్వాత కుటుంబానికి అందిన లేఖ
దానిని స్పీడ్ పోస్టు చేశారు. కానీ, అది ఈ రోజు అతని కుటుంబానికి అందింది. అఫ్జల్ ఉరి తీత విషయం అతని కుటుంబానికి సమాచారం ఇచ్చామని ప్రభుత్వం, ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాదిస్తున్న నేపథ్యంలో ఇవాల లేఖ అందడం గమనార్హం. అఫ్జల్ గురు ఉరిని తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఆరోపించారు. అధికారులు మాత్రం తాము స్పీడ్ పోస్టు చేశామని తెలిపారు. మరోవైపు కాశ్మీరులో మూడో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది.
కాగా పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు జరపడాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన కాశ్మీర్ లోయలోని యువతలో తాము పరాయివారమన్న భావనను కలిగిస్తుందని, ఉరి అమలు అన్యాయమని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు మరణ శిక్షను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. అఫ్జల్ను ఉరి తీయకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఉరితీసే ముందు అఫ్జల్ను కలుసుకునేందుకు, ఆ తర్వాత అతని అంత్యక్రియలకు అఫ్జల్ కుటుంబ సభ్యులను అనుమతించక పోవడం సరికాదన్నారు. అఫ్జల్ ఉరి విచారకరమని, దీని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని, పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఓమర్ అన్నారు. కాశ్మీరులోని ఓ తరం ప్రజలు తమని తాము బాధితులుగా భావిస్తున్న విషయం అర్థం చేసుకోవాలన్నారు. కాశ్మీరు యువతకు అక్బర్ ఉరి ఆగ్రహాన్ని కలిగించవచ్చునన్నారు.