2 వేల కిమీ మైలురాయి చేరుకున్న బాబు పాదయాత్ర
ప్రజలు చూపిస్తున్న అభిమానం జీవితంలో మరువలేనిదని అన్నారు. మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందిగానీ, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని అన్నారు. సమసమాజం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, కానీ కొందరు నేతలు దోచుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ హాయంలో రహదారులను అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పుకున్నారు. కాంగ్రెస్ దొంగలు ప్రజలను దోచుకుంటున్నారని, ప్రజా ధనం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి పోతుందని ఆయన ధ్వజమెత్తారు.నిత్యావసర వస్తువులు పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం అసమర్థల వల్లే ధరలు పెరిగాయని ఆరోపించారు.
గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 35వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు లక్ష రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
నిరుడు అక్టబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి రోజు 'వస్తున్నా...మీకోసం'' పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు 134 రోజులలో రెండువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాలు, 55 నియోజకవర్గాలు, 107 మండలాలు, 17 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 915 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు.