లక్ష విగ్రహాలు-లక్ష కోట్లు: వైఎస్పై బాబు, యాత్రకు బ్రేక్!
రాష్ట్రంలో అక్రమార్కుల విగ్రహాలు పెద్ద ఎత్తున స్థాపిస్తున్నారని, అవి అక్రమ సంపాదనతో నిర్మించినవే అన్నారు. దోపిడీదారులకు విగ్రహాలు పెట్టడం మన దౌర్భాగ్యమని విమర్శించారు. తాము తమ హయాంలో ఎలాంటి తప్పు చేయలేదని అందుకే, తన పాదయాత్రలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వగలుగుతున్నానని చెప్పారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న కాంగ్రెసు నేతలు రోడ్డు మీదకు వస్తే నిలదీస్తారన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ అసాధ్యమంటే కేంద్ర నేతలు మాత్రం సై అంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. సుపరిపాలన టిడిపితోనే సాధ్యమన్నారు.
చంద్రబాబు యాత్రకు బ్రేక్!
చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు బ్రేక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆయన పాదయాత్రకు విరామం రానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 19-21 మధ్య జిల్లాలో ఇతర నేతలు ఉండకూడదని ఎన్నికల అధికారులు హుకుం జారీ చేశారు. చంద్రబాబుకు సమాచారం అందించే సన్నాహాలు చేపట్టారు. దీంతో బాబు యాత్రకు జిల్లాలో మూడు రోజుల పాటు విశ్రాంతి లభించే అవకాశాలున్నాయి.