కొండ్రు X టిడిపి: బాబుకు పిచ్చి, జగన్ వాటాదారుకే
చంద్రబాబు ప్రారంభిస్తున్న స్థూపాలు ఆయన అవినీతికి ప్రతిరూపాలన్నారు. తన తొమ్మిదేళ్ల పాలన అవినీతి తెలిసేందుకు ఆయన స్థూపాలు కడుతున్నారేమో అన్నారు. ప్రపంచంలో చంద్రబాబు అంత అవినీతిపరుడు లేడన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి అధ్యక్షుడిని మార్చుకోవాలన్నారు. లేదంటే ఆ పార్టీ పతనం కావడం ఖాయమన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఘనుడు బాబు అన్నారు.
మద పిచ్చి
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి మంత్రి కొండ్రు మురళికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ విజయవాడలో అన్నారు. కొండ్రుకు అధికార మద పిచ్చి పట్టుకుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి పాదయాత్ర తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసులకు రాజకీయంగా అంతిమ యాత్రేనని ఆయన అన్నారు.
తమ పార్టీ అధినేతను మార్చుకోవాలని సూచించే బదులు లిక్కర్ డాన్గా పేరు పొందిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కొండ్రుకు వాటా ఉందన్నారు. సిబిఐతో ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
పాదయాత్రలతో లాభం లేదు
పాదయాత్రల కంటే ప్రజా సమస్యలపై పోరాటమే మిన్న అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారన్నారు.