ఇంకా జైల్లో ఎన్నాళ్లు?: జగన్ లాయర్, ఎల్వీకి అక్షింతలు
ఏ కారణం చూపకుండా జైలులో ఉంచడం సరికాదన్నారు. ప్రతి పద్నాలు రోజులకు ఓసారి రిమాండును పొడిగిస్తున్నారని ఆక్షేపించారు. సిబిఐ తన దర్యాఫ్తును ఎప్పుడు పూర్తి చేస్తోందో? ఎప్పుడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేస్తుందో? తెలియకుండా ఉందన్నారు. సిబిఐ తన ఆఖరి ఛార్జీషీట్ ఎప్పుడు దాఖలు చేయనుందో? దర్యాఫ్తు ఎప్పుడు పూర్తి చేస్తారో? స్పష్టంగా చెప్పాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో సిబిఐని ప్రశ్నించారు.
జగన్ని అలాగే జైలులో ఉంచేందుకు సిబిఐ తగిన కారణాలను చూపించడం లేదన్నారు. ఇది సరికాదన్నారు. కాగా ఎమ్మార్, జగన్ కేసు, ఓఎంసి కేసుల నిందితుల రిమాండు నేటితో ముగియడంతో సిబిఐ కోర్టు వారిని ఈ రోజు విచారించింది. జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, గాలి జనార్ధన్ రెడ్డి తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది.
విజయ సాయి రెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు కోర్టుకు హాజరయ్యారు. పెళ్లి ఉందని చెప్పి మంత్రి ధర్మాన ప్రసాద రావు హాజరు కాలేదు. నిందితులను విచారించిన కోర్టు వారికి ఈ నెల 27వ తేది వరకు రిమాండును పొడిగించింది. కాగా గతంలో కోర్టుకు హాజరు కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కోర్టు మండిపడింది. ఎందుకు కోర్టుకు హాజరు కాలేదో వివరించాలని ఆదేశించింది.