అక్బరుద్దీన్ విడుదలకు బ్రేక్!: పాస్పోర్ట్ సమర్పించలేదనే
అక్బరుద్దీన్ బెయిల్ ఆర్డర్లు తీసుకు రావాల్సిన ఆయన తరఫు లాయర్లు జైలు వద్దకు రావడానికి మరో ఒకటి లేదా రెండు గంటలు పట్టే అవకాశముంది. ఈ రోజు శనివారం మధ్యాహ్నం ఒకటి గంటల వరకే కోర్టు పని చేస్తుంది. దీంతో అక్బరుద్దీన్ విడుదల ఈ రోజు అవుతుందా? లేదా సోమవారం అవుతుందా? అనేది తెలియరాలేదు. అక్బరు లాయర్లు నిర్ణీత సమయంలోగా బెయిల్ పత్రాలతో పాటు పాసుపోర్టును సమర్పిస్తే ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే రేపు ఆదివారం సెలవు కారణంగా ఎల్లుండి వరకు అక్బర్ విడుదలక కోసం నిరీక్షించాల్సి ఉంటుంది.
కాగా, హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అదిలాబాదు జిల్లా, నిజామాబాద్ జిల్లా కోర్టులలో శుక్రవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అక్బర్కు జిల్లా సెషన్స్ కోర్టు మూడు షరతులతో కూడిన బెయిలును ఇచ్చింది. పాసుపోర్టును అప్పగించాలని, నిర్మల్ పట్టణంలో ప్రవేశించకూడదని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం షరతులు విధించింది.
రూ.70వేల చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్ ఇచ్చింది. పైన విధించిన షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని న్యాయస్థానం తెలిపింది. అక్బరుద్దీన్ ఓవైసీకి నిజామాబాద్ కోర్టు అంతకుముందు బెయిల్ మంజూరయింది. నిజామాబాద్ జిల్లా కోర్టు ఈ రోజు ఆయనకు రూ.10వేలు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది.