మాజీ ఎయిర్ హోస్టెస్ గీతిక తల్లి ఆత్మహత్య, వేధింపులే!
కుమార్తె మరణంతో ఆమె కుంగిపోయిందని చెప్పారు. అనురాధ శర్మ ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. గీతిక శర్మ ఆత్మహత్య తర్వాత అనురాధ శర్మ కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ ఏమంటే గీతిక ఆత్మహత్య కేసును వెనక్కి తీసుకోవాలనే కందా ఒత్తిడి కారణంగానే అనురాధ కూడా ఆత్మహత్య చేసుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరు నెలల్లో కందా మనుషులు పలుమార్లు కేసు వెనక్కి తీసుకోవాలని వేధించినట్లు ఆరోపిస్తున్నారు.
కాగా ఎమ్డిఎల్ఆర్ గ్రూప్కు చెందిన విమానయాన సంస్థలో ఎయిర్ హోస్టెస్గా పని చేసిన గీతిక ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ సంస్థ అధిపతి, హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా ఆత్మహత్యకు కారణమని లేఖ రాసింది.
ఈ కేసులో అరెస్టయిన గోపాల్ కందా ప్రస్తుతం జైలులో ఉన్నారు. గీతిక కేసులో ఆరోపణలు రావడంతో ఆయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. మరోవైపు గీతిక ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతోంది. గీతిక, గోపాల్ కందా కుటుంబ సభ్యులు కలిసి తీర్థయాత్రలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది.