జగన్ కేసు: ఆస్తుల స్వాధీనానికి ఈడికి అనుమతి
జగన్ ఆస్తుల కేసులో ఈడి మనీలాండరింగ్ చట్టాల ఉల్లంఘనలను ఈడి నిర్ధారించి గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈడి 51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులను జప్తు చేయడానికి నిర్ణయం తీసుకుంది. కుట్రల ద్వారా తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడి వ్యాఖ్యానించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
హెటిర్ డ్రగ్స్కు చెందిన 35 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే జననీ ఇన్ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేయడానికి అనుమతి పొందింది. వైయస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన 14.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడి జప్తునకు నోటీసులు జారీ చేసింది.
హెటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలకు 75 ఎకరాల భూములను కేటాయించడం వల్ల ఆ సంస్థలు 8.6 కోట్ల రూపాయల చొప్పున లబ్ధి పొందాయని ఈడి నిర్ధారించింది. ట్రైడెంట్కు 30.33 ఎకరాల భూములను కేటాయించారని, దాని వల్ల ఆ సంస్థ 4.3 కోట్ల రూపాయల ప్రయోజనం పొందిందని ఈడి వివరించింది. కుట్ర ద్వారా ప్రభుత్వం నుంచి ఈ సంస్తలు దొడ్డిదారిన ప్రయోజనం పొందాయని ఈడి ఆరోపించింది. ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి అడ్డదారిలో తక్కువ ధరలకు భూములను కేటాయించినట్లు ఈడి గుర్తించింది.
వైయస్ జగన్ అక్రమంగా ఆస్తులను సంపాదించుకోవడానికి ఆ సంస్థలు సహకరించాయని ఈడి ఆరోపించింది. ఈ కేసులో తదుపరి చర్యలుంటాయని ఈడి తెలిపింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన రెండు చార్జిషీట్లలో పొందుపరిచిన అంశాలపైనే ఈడి చర్యలు తీసుకుంది. మరో రెండు చార్జిషీట్ల విషయంలో కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. సిబిఐ దర్యాప్తును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ తమంత తాముగా తమ పద్ధతిలో కూడా దర్యాప్తు జరిపిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నట్లు ఈడి తెలిపింది. జగన్తో పాటు మరో 73 మంది నిందితులపై కూడా ఈడి దర్యాప్తు సాగిస్తోంది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను, హైదరాబాదులోని గచ్చీబౌలి బౌల్టర్ హిల్స్లో గల 34 విల్లా స్థలాల స్వాధీనానికి ఈడికి అనుమతి లభించింది.