వైయస్ నిర్ణయంతో కోట్ల భారం కానీ: పిఎంకి విజయమ్మ
కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ ప్రయోజనాన్ని పొందలేని ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నజారానా అందించాలని నిర్ణయించారని, అందులో భాగంగా సకాలంలో రుణాలు చెల్లించిన ఒక్కొక్క రైతుకు రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారన్నారు. ఫలితంగా 36 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. విపక్షాలు కూడా వైయస్ నిర్ణయాన్ని ప్రస్తుతించాయన్నారు.
వైయస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానా మీద రూ.1,800 కోట్లు భారం పడిందని, ఈ కారణంగా మంత్రులు, అధికారులు వ్యతిరేకత వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఆయన తన నిర్ణయాన్ని అమలు చేశారన్నారు. వైయస్లా సకాలంలో రుణాలు చెల్లించిన రైతులను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. రైతులను ప్రోత్సహించేందుకు ఖజానాపై భారం పడినా వైయస్ వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు.
రైతులు, గ్రామీణ వృత్తిదారుల రుణాలను మాఫీ చేసే పథకాన్ని అమలు చేయాలని ఆమె ప్రధానిని తన లేఖలో కోరారు. ఎరువుల ధరల పెరుగుదల భారం నుంచి రైతులను కాపాడాలని కోరారు. అలాగే ధరల పెరుగుదలకు అనుగుణంగా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు, గ్రామీణ వృత్తి పని వారి రుణాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం మాఫీ చేయాలని కోరారు.