సార్వత్రిక సమ్మె: స్తంభించిన రవాణా, కార్మికనేత మృతి
మహారాష్ట్రలో శివసేన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కీలకంగా పని చేస్తోంది. ముంబయిలో సమ్మె ప్రభావం అంతగా పడలేదు. ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ జిల్లా రామగుండం 1,2,3 ఏరియాల్లో సింగరేణి కార్మికులు ఉదయం విధులను బహిష్కరించారు. అదిలాబాదు జిల్లాలోను కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని 19 గనుల్లో ఇరవై వేల మంది కార్మికులు విధులను బహిష్కరించడంతో ఉత్పత్తి నిలిచిపోనుంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిస్థితి ఇంతే.
హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఆటోలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కొత్తూరు జూట్ మిల్లులో 7వేల మంది కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీ, శరద్పవార్, మల్లికార్జున ఖార్గేలు పాల్గొన్న మంగళవారం నాటి చర్చలు విఫలమయ్యాయి.
ధరల పెరుగుదల అరికట్టాలని, ఉపాధి కల్పన జరగాలని, కార్మిక చట్టాల అమలు కఠినతరం చేయాలనంటూ కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లు చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను మంత్రులు వారికి వివరించారు. తమ డిమాండ్లపై నిర్దిష్ట హామీ ఏదీ ప్రభుత్వం నుంచి లభించకపోవడంపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు.
ట్రేడ్ యూనియన్ లీడర్ మృతి
రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ప్రారంభమైన సమ్మె మొదటి రోజు హర్యానాలో విషాదం అయింది. హర్యానా రాష్ట్రంలోని అంబాలా బస్సు డిపో వద్ద ఏఐటియుసి ధర్నా చేసింది. డిపో నుండి బయటకు వస్తున్న బస్సును ఆపేందుకు కార్మికులు ప్రయత్నించారు. ఈ ఘటనలో కార్మిక నేత నరేంద్ర సింగ్ మృతి చెందాడు.
దీంతో రెచ్చిపోయిన కార్మికులు విధ్వంసానికి దిగారు. సమ్మె నేపథ్యంలో బలవంతంగా బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు. నరేంద్ర సింగ్ మృతికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిఎం కారణమని పేర్కొంటూ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.