సీమాంధ్ర నేతల్నినమ్మొద్దు, సభలో విన్పించాం: ఎంపీలు
ఇదే కేంద్రం, ఇదే పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తాము తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేశామన్నారు. గూర్ఖాలాండుకు, తెలంగాణకు కొందరు లింక్ పెడుతున్నారని, ఈ రెండింటికి ఏ మాత్రం సంబంధం లేదని ఎంపీలు అన్నారు. వేరు వేరు అంశాలను ఒక్కటి చేయవద్దన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ తరహా ఎలాంటి ప్రతిపాదనలను తాము అమోదించే ప్రసక్తి లేదన్నారు. ఓ పార్లమెంటు సభ్యుడు హైదరాబాదులో ఉన్నందున తమతో పాటు లేరని వివరణ ఇచ్చారు. ఎంపీలమందరం తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఉన్నా తెలంగాణ ప్రజల వెంటే తాము ఉంటామన్నారు. మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడుతామని చెప్పారు.
సమైక్యవాదులు తప్పుడు ప్రకటనలు, నివేదికలను నమ్మవద్దన్నారు. వారి రాజీనామాలు కూడా నమ్మొద్దన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గతంలో భువనగిరి సభలో తెలంగాణకు అనుకూలమని చెప్పారని, దానికి కట్టుబడి ఉండాలన్నారు. సీమాంధ్ర నేతల మాటలు నమ్మవద్దన్నారు. తెలంగాణ ఉద్యమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.
12 ప్రాంతాల్లో సడక్ బంద్
ఈ నెల 24న నిర్వహించనున్న సడక్ బందుపై పన్నెండు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. బందు నిర్వహణకు సంబంధించి తెరాస, బిజెపి నేతలతో జెఏసి సమావేశమైంది. జిల్లా సడక్ కేంద్రాల బాధ్యతలను పలువురికి అప్పగించాలని జెఏసి నిశ్చయించింది. సడక్ బందులో అంబులెన్స్ వంటి అత్యవసర కార్యకలాపాలకు అడ్డంకులు ఉండవన్నారు.