సాక్ష్యులకు విజయసాయి బెదిరింపు, ఆధారాలు: సిబిఐ
వాదనల సందర్భంగా విజయ సాయి ఈ కేసులో కీలకం అని సిబిఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. పెట్టుబడిదారులను ప్రభావితం చేసి బలవంతంగా వారిచే జగన్ కంపెనీలలో విజయ సాయి రెడ్డి పెట్టుబడులు పెట్టించారన్నారు. నిజా నిజాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విజయ సాయి రెడ్డికి బెయిల్ ఇచ్చిందన్నారు. ఇంకా తుది ఛార్జీషీటు దాఖలు చేయాల్సి ఉందన్నారు.
విజయ సాయి రెడ్డి సాక్ష్యులను బెదిరిస్తున్నారన్నారు. ఆయన బయట ఉన్న సమయంలో తుది ఛార్జీషీట్ దాఖలు చేస్తే బెదిరిస్తారన్నారు. ఆయన బెదిరించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. విజయ సాయి రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఆయన బెయిల్ రద్దు చేయకుంటే విచారణ సాఫీగా సాగదన్నారు.
హైకోర్టు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సాయికి బెయిల్ ఇచ్చిందని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది చెప్పారు. ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. సాయికి బెయిల్ ఇచ్చిన సిబిఐ రెండు ఛార్జీషీట్లను దాఖలు చేసిందన్నారు. ఆయన సాక్ష్యులను బెదిరించలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణను 14కు వాయిదా వేసింది.