పేలుళ్లు: సైకిళ్లపై ఉగ్రవాదులు చక్కర్లు కొట్టారా?
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అమర్చిన సిసిటీవిల ఫుటేజ్లను మాత్రమే కాకుండా ప్రైవేట్ భవనాల్లోని సిసిటివీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. రెండు సైకిళ్లపై నలుగురు వ్యక్తులు అదే పనిగా దిల్షుక్నగర్లో ముమ్మరంగా చక్కర్లు కొట్టినట్లు భావిస్తున్నారు. ఉగ్రవాదులు బస్ స్టాపుల్లో తచ్చాడినట్లు కూడా అనుమానిస్తున్నారు.
ఈమెయిల్స్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్జల్గురు ఉరితీతకు నిరసనగానే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఇండియన్ ముజాహిదీన్ పేలుళ్లకు పాల్పడినట్లు నమ్ముతున్నారు. ఇండియన్ ముజాహిదీన్కు, లష్కరే తోయిబాకు మధ్య గల సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. హైదరాబాదు, బెంగళూర్, పూణేల్లో దర్యాప్తు సాగుతోంది.
హైదరాబాదులోని చర్లపల్లి జైలులో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులతో జరిగిన ములాఖత్లను పరిశీలిస్తున్నారు. మక్బూల్ ఈ పేలుళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. అతన్ని ఎవరెవరు కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
కాగా, మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడవచ్చునని కేంద్ర నిఘా వర్గాలు వివిధ రాష్ట్రాలను హెచ్చరించాయి. హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీల్లో దాడులు జరిగే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి.