హైదరాబాద్ పేలుళ్లు: నేపాల్ బోర్డర్లో ఇద్దరు దొరికారు

అనుమతి లేకుండా నేపాల్లోకి అక్రమంగా ప్రవేశించి ఖాట్మండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరిని హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఆదాంగా, రెండో వ్యక్తిని సోమాలియాకు చెందిన మహ్మద్ అబ్దుల్లా ఓమన్గా గుర్తించారు. వీరివద్ద ఉన్న లాప్టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫొటోలు, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఫొటోలు, కొన్ని వీడియో ఫుటేజ్లు వారి వద్ద ఉన్న కెమెరాలో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితుల కోసం దేశ సరిహద్దులను అప్రమత్తం చేయడంతోపాటు అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా వర్గాలు సందేశాలు పంపించడంతో అప్రమత్తమయ్యారు.
వీరిద్దరి వద్ద ఫొటోలు దొరకడం, అక్రమంగా నేపాల్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న కారణంతో అనుమానితులుగా విచారిస్తున్నారు. హైదరాబాద్ పేలుళ్లతో వీరికి ఏదైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. వీరిద్దరినీ బీహార్లోని పూర్వి చంపరన్ జిల్లా పోలీసులకు సరిహద్దు భద్రత దళం సిబ్బంది అప్పగించడంతో అక్కడ విచారణ జరుగుతోంది. వీరినుంచి లాప్టాప్, మొబైల్, కెమెరా, డ్రైవింగ్ లైసెన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు ఢిల్లీనుంచి రైల్లో బయలుదేరి బీహార్లోని రాక్సుల్ స్టేషన్లో దిగారు.
ఢిల్లీకి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరి వెళ్లినట్టు విచారణ అధికారులు భావిస్తున్నారు. సోమాలియన్ దేశస్థుడు మహ్మద్ అబ్దుల్లా ఓమన్ (25)ను బీహార్ పోలీసులు ప్రశ్నించగా తాను జర్మన్ దేశస్ధుడినని, తాను రెండోసారి భారత్కు వచ్చానని వివరించాడు. ఖాట్మండ్ మీదుగా ఈ ఏడాది జనవరిలో భారత్కు వచ్చానని చెప్పాడు.
హైదరాబాద్కు చెందిన ఆదాం మాత్రం తన తండ్రి హైదరాబాద్లో నివసిస్తున్నట్టు తెలిపాడు. అయితే ఓమన్తోపాటు ఖాట్మండ్ ఎందుకు వెళ్తుందీ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫొటోలు, హైదరాబాద్ ఫొటోలు, మ్యాప్లను ఎందుకు తమవెంట తీసుకువెళ్తున్నదీ వారు విచారణలో సరిగ్గా వివరించకపోవడంతో వారిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications