'కత్తులు'పై కాంగ్రెస్ ఫైర్: బెదిరింపులంటూ బాబు కౌంటర్
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జోలికి కాంగ్రెసు నేతలు వస్తే రైతులు, పేద ప్రజలు వారిని నడి రోడ్డు పైన ఉరితీస్తారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ సోమవారం హైదరాబాదులో అన్నారు. కాంగ్రెసు నేతలకు ధైర్యముంటే బాబుపై కేసు నమోదు చేయాలని సవాల్ విసిరారు.
ప్రజా సంక్షేమం కోసం బాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అవినీతి, అక్రమాలు చేసి జైలుకు వెళ్లిన నేతలను వదిలి కాంగ్రెసు నేతలు తమ అధినేత పైన విమర్శలు గుప్పించడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పేద ప్రజలు, రైతుల కోసం వస్తున్నా మీకోసం పాదయాత్రను తలపెట్టారన్నారు.
కాంగ్రెసును చంపాలా?: బాలరాజు
కాంగ్రెసును చంపాలన్న చంద్రబాబు వ్యాఖ్యల పైన మంత్రి బాలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అదుపుతప్పి మాట్లాడుతున్నారని, అధికారమే పరమావధిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. బాబు పదవి ఉంటే ఓ విధంగా లేకుంటే మరో విదంగా మాట్లాడుతారని, ఇది ఆయన స్థాయికి తగదన్నారు.
కేసులు పెడతారా?: చంద్రబాబు
ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తాను ప్రజలకు పిలుపునిస్తే కేసులు పెడతానని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు గుంటూరు జిల్లాలో తన పాదయాత్రలో ఆరోపించారు. రైతులకు నీళ్లు ఇచ్చి, తమపై కేసులు పెట్టాలని చంద్రబాబు అన్నారు. కత్తులు, కొడవళ్లు రైతుల జీవితంలో భాగమని అందుకే, వాటితో రోడ్డెక్కాలని సూచించానని అన్నారు.
కాగా అంతకుముందు బొత్స సత్యనారాయణ, గండ్ర వెంకట రమణ రెడ్డి తదితరులు బాబు వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.