దిల్షుక్నగర్ పేలుళ్లు: రూం నెంబర్ 303 మిస్టరీ

పేలు ళ్లు జరిగిన వెంటనే దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని లాడ్జిలు, హోటళ్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలపై పోలీసులు కన్నేశారు. ఇందులో భాగంగానే శిల్పి లాడ్జిలోని ఫుటేజీని పరిశీలించారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా వారికి కీలక ఆధారాలు దొరికినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం - పేలుళ్లకు 14 రోజుల ముందుగా ఈనెల ఏడో తేదీనే ఈ లాడ్జిలో రెండు రూములు (302, 303) బుక్కయ్యాయి. బుక్ చేసింది సుభానీ అయితే.. బుక్ చేసింది మాత్రం విజయ్ కోసం.
విజయ్ వచ్చి 303లో ఉన్నాడు. మరో రూము ఖాళీగానే ఉంది. వారం తర్వాత అంటే ఫిబ్రవరి 15వ తేదీన రూం నెంబర్ 303లో మరో ఇద్దరు దిగారు. వారిలో ఒకడు సాజిద్ కాగా మరొకడు అలీఖాన్. ఇద్దరూ 16వ తేదీ వరకు ఇక్కడే ఉన్నారు. చెప్పాపెట్టకుండా రూం ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, ఈ ఇద్దరి పేర్లు, వివరాలు కూడా నకిలీ అని విచారణలో తేలిపోయింది. ఫిబ్రవరి 21వ తేదీన మరో వ్యక్తి రూం నెంబర్ 303లో దిగాడు. అతడి పేరు రాజు. గుర్తింపు కార్డు కింద ఓటరు కార్డు ఇచ్చాడు.
అందులో తనది మిర్యాలగూడ అని, తండ్రి పేరు వెంకటేశ్వరరాజు అని ఉంది. ఇది కూడా నకిలీయే. పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లిన రాజు పేలుళ్లు జరిగిన తర్వాత తిరిగి వచ్చాడు. రాత్రి 8 గంటలకు చెప్పా పెట్టకుండా రూం ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
శిల్పి లాడ్జి వీడియో ఫుటేజీని పరిశీలించిన మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు పేలుళ్ల రోజు రూం నెంబర్ 303కి వచ్చి హడావిడిగా వెళ్లిపోయిన వ్యక్తిని రాజుభయ్యా అలియాస్ అక్తర్గా గుర్తించినట్లు తెలిసింది. ఇండియన్ ముజాహిదీన్ భారత్ చీఫ్ యాసిన్ భత్కల్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయని, వీరంతా గతంలో సిమిలో కలిసి పని చేశారని ఏటీఎస్ వర్గాలు గుర్తించాయి.












Click it and Unblock the Notifications