జగన్ పార్టీలో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సమాలోచన!
త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు. ఆయన జగన్ పార్టీలోకి వెళ్తారని కాంగ్రెసు పార్టీ మానసికంగా సిద్ధమైపోయింది. ఆయన జగన్ వైపు వెళ్లేందుకు గట్టిగా నిర్ణయించుకోవడంతో పార్టీలోనే ఉంచే ప్రయత్నాలు కూడా పెద్దగా చేయడం లేదట.
గొట్టిపాటి రవి కుమార్ జగన్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరగడంతో ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ వ్యాఖ్యానించారు. పదిహేను రోజుల క్రితం అద్దంకి నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఉదయం కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులో కలిశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని, ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని ముఖ్యమంత్రికి కార్యకర్తలు సూచించారు.
కొత్త వారిని నియమిస్తానని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని, కొత్తవాళ్లు పార్టీని బలోపేతం చేస్తారని కార్యకర్తలకు చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ గొట్టిపాటి రవికుమార్ను ఉద్దేశించి అన్నారు. తన వల్లే పార్టీ బతుకుతుందని అనుకుంటే పొరపాటు అన్నారు. అలా అనుకున్నవారు నష్టపోక తప్పదన్నారు. నాయకులు పోయినా కాంగ్రెసు పార్టీకి కార్యకర్తలు ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో ఇది నిరూపితమైందన్నారు. నేతలు వెళ్లినా కార్యకర్తలు వారి వెంట వెళ్లలేదని అందరికీ తెలిసిందన్నారు. పార్టీకీ కార్యకర్తలే బలమని రుజువైందన్నారు.