ఒక్క రూపాయి పెంచినా ఊరుకోం: ప్యాప్సీ వద్ద ఉద్రిక్తం
ఛార్జీలను పెంచితే సహించేది లేదన్నారు. నేతలు ఆందోళన చేపడుతుండటంతో విచారణను అధికారులు నిలిపివేశారు. అంతకుముందు వీరి ఆందోళనల మధ్యనే ఈఆర్సి బహిరంగ విచారణ ప్రారంభమైంది. వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు తదితరులు భారీగా బహిరంగ విచారణ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఛార్జీల పెంపు అక్రమమని నిలదీశారు. ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. దీంతో ప్యాప్సీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
విపక్షాల ఆందోళన ఎంతకూ తగ్గక పోవడంతో అధికారులు ఆ తర్వాత విచారణ నిలిపివేశారు. బహిరంగ విచారణ వాయిదాకు నేతలు పట్టు పట్టారు. ఈ రోజు ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కాగానే విపక్షాలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశాయి. ఈఆర్సి చైర్మన్, సభ్యులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు పలువురు నేతలను అక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై రాఘవులు తీవ్రంగా మండిపడ్డారు. బహిరంగ విచారణ అడ్డుకునేందుకు రాఘవులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో అక్కడకు చేరుకున్నారు. కొన్ని గ్యాస్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచాలని చూస్తోందని ఆరోపించారు. ఇది బహిరంగ విచారణ కాదని, బూటకపు విచారణ అని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి పెంచినా ఊరుకునేది లేదన్నారు.