సినిమాలో మమత ఇష్యూ: విడుదలకు సెన్సార్ బోర్డ్ నో
తృణమూల్ కాంగ్రెసు పార్టీ రెబల్ పార్లమెంటు సభ్యుడు కబిర్ సుమన్ నటించిన కంగల్ మల్సత్ సినిమాకు సుమన్ ముఖోపాద్యాయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవి తనయుడు నాబారున్ భట్టాచార్య రాసిన పుస్తకం ఆధారంగా తీశారు.
ఈ సినిమాలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న షాట్స్ ఉన్నాయి. ఈ సన్నివేశం పలువురు మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ఉద్రిక్తత కూడా దారి తీయవచ్చుననే ఉద్దేశ్యంతో సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సినిమాలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దానిని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటుందట.
అంతేకాకుండా సింగూర్ ఉద్యమం అంశం సినిమాలో జొప్పించారట. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు సింగూరులో టాటా కంపెనీ పరిశ్రమను మమతా బెనర్జీ వ్యతిరేకించారు. ఈ ఘటనను కౌంటర్గా సన్నివేశాల్లో పరోక్ష డైలాగ్లు ఉన్నాయట. దీంతో సెన్సార్ బోర్డు సినిమాకు అంగీకరించలేదు.
రాజకీయ కారణాలతో సినిమాను నిలుపుదల చేయడంతో సినిమా దర్శకుడు ఫిలిమ్ సెర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యూనల్లో సవాల్ చేశారు. ఒక దర్సకుడిగా తాను ఏమి అనుకున్నానో అలానే తీశానని, సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని దర్శకుడు అన్నారు.
కాగా సెన్సార్ బోర్డులో ప్రభుత్వం నియమించిన వారు సభ్యులుగా ఉన్నారు. వారే ఇప్పుడు సినిమా విడుదలను అడ్డుకుంటున్నారంటున్నారు. తన సినిమాను విడుదల చేయకుండా అడ్డుకుంటోంది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని దర్శకుడు చెప్పారు.