నింగికెగిసిన పిఎస్ఎల్వీ - సీ 20: వీక్షించిన ప్రణబ్

శ్రీహరికోట నుంచి నాలుగు దశల్లో పిఎఎస్ఎల్వీ రాకెట్ను నింగిలోకి ప్రయోగించారు. ఈ రాకెట్ మోసుకెళ్లినవాటిలో సముద్రంలోని మార్పులను కనిపెట్టే 410 కిలోల సరల్తో పాటు కెనడా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, యుకెలకు చెందిన లఘు ఉపగ్రహాలు ఉన్నాయి. పిఎఎస్ఎల్వీ ప్రయోగాన్ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రత్యక్షంగా వీక్షించిన రెండో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇంతకు ముందు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ప్రత్యక్షంగా పిఎఎస్ఎల్వీ ప్రయోగాన్ని వీక్షించారు.
నెల్లూరు జిల్లా షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి సోమవారం సాయంత్రం 6.01 నిమిషాలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ20 నిటారుగా నింగిలోకి దూసుకుపోయింది. సోమవారం సాయంత్రం 5.56 నిముషాలకు ప్రయోగించాల్సి ఉండగా ఐదు నిముషాలు ఆలస్యంగా అంటే 6.01 గంటలకు ప్రయోగించారు.
44.4 మీటర్ల ఎత్తు కలిగిన పీఎస్ఎల్వీ-సీ20 రాకెట్ ప్రయోగ సమయంలో 229.7 టన్నుల బరువుకలిగి ఉంది. పీఎస్ఎల్వీ రాకెట్లను గతంలో స్ప్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించేవారు. అయితే ప్రస్తుతం ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ-సీ20ని స్ప్రాపాన్ బూస్టర్లు లేకుండానే ప్రయోగించడం విశేషం. ఇలా స్ప్రాపాన్ బూస్టర్లు లేకుండా ఇస్రో ఇప్పటికి 8 పీఎస్ఎల్వీలను దిగ్విజయంగా
ప్రయోగించింది. పీఎస్ఎల్వీ-సీ20రాకెట్ ప్రయోగానికి 240 కోట్లు ఖర్చు చేశారు. రాకెట్ తయారీకి రూ. 80 కోట్లు, సరళ్ ఉపగ్రహం తయారీకి రూ. 100 కోట్లు వినియోగించారు. ప్రయోగంలో ఇతర ఖర్చులకు రూ. 60 కోట్లు అవుతున్నట్లు సమాచారం.
ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఉపగ్రహాల ప్రయోగం చూసి పులకించిపోయానని ఆయన అన్నారు. భారత కీర్తిని శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్ర రాజ్యాల సరసన నిలిచిందని ఆయన అన్నారు. రోదసీ ప్రయోగాల్లో భారత్ విదేశాలకు చేయూతనిచ్చిందని అన్నారు. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలను మన శాస్త్రవేత్తలు అబ్బురపరిచారని ఆయన అన్నారు. ద్వేపాక్షిక సంబంధాలను ప్రయోగాలు మెరుగుపరిచాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications