ట్విట్టర్, ఫేస్బుక్లలో బిజెపి చీఫ్ కిషన్ రెడ్డికి బెదిరింపు
కిషన్ రెడ్డికి ఇక్రమ్, సాజిద్ల పేర్లతో ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుండి వస్తున్న అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడంలో విఫలమవుతున్నామని, పలువురు హైదరాబాదులో నివసిస్తున్నారని కిషన్ రెడ్డి ఫేస్బుక్లో రాశారు. అక్రమ చొరబాడుదారుల పైన అధికార పార్టీ దృష్టి సారించాలని ఆయన సూచించారు. కాంగ్రెసు ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రజల జీవితాలతో ఆటాడుకుంటోందని విమర్శించారు.
తనకు వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో తాను ఎలాంటి అదనపు భద్రతను కోరుకోవడం లేదన్నారు. బెదిరింపు లేఖలు రావడం కొత్త కానప్పటికీ సామాజిక వెబ్ సైట్లలో బెదిరింపులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తనకు పలుమార్లు బెదిరింపు లేఖలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ సాధారణంగానే తీసుకుంటున్నప్పటికీ దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ పేలుళ్లు తమ పనేనంటూ కిషన్ రెడ్డికి రెండు రోజుల క్రితం లష్కరే తోయిబా పేరుతో బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి ఆదివారం చెప్పారు. లష్కరే తోయిబా పేరుతో బిజెపి కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చిందని చెప్పారు.
దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు తమ పనేనని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఆయన చెప్పారు. బాంబు పేలుడు తమ పనేనని, తర్వాత తమ టార్గెట్ బేగంబజార్ అని అక్కడ కూడా త్వరలో దాడి చేస్తామని లేఖలో హెచ్చరించారని కిషన్ రెడ్డి చెప్పారు. తమకు వచ్చిన లేఖ పైన అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.