రైల్వే బడ్జెట్: ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే జరిగిందా?

ఎంత చేసిన అసంతృప్తి ఉంటుందని రాష్ట్రానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఎంపీలందరినీ పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక్కో ఎంపీ ఐదారు ప్రాజెక్టులు ఇచ్చారని, ఇచ్చినవన్నీ చేయడం సాధ్యం కాదని, ప్రాధాన్యతలను బట్టి తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే, మొత్తంగా రాష్ట్రానికి నిరుటి కన్నా ఏదో మేరకు కాస్తా మేలు చేసినట్లుగానే రైల్వే బడ్జెట్ కనిపిస్తోంది. అయితే, ఆకాంక్ష మేరకు ఫలితం దక్కలేదనేది మాత్రం నిజం. చాలా కాలంగా జరుగుతున్న అన్యాయాన్ని పూడ్చడం కూడా సాధ్యం కాదు.
రాష్ట్రానికి 15 కొత్త రైళ్లు, నాలుగు కొత్త లైన్లతో సహా పలు రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి దక్కనున్నాయి. దేశవ్యాప్తంగా 67 ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రకటించగా అందులో 13 మన రాష్ట్రానికి కేటాయించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నియోజకవర్గమైన కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రైళ్ల మరమ్మత్తుల వర్క్షాప్ను నెలకొల్పనున్నారు. రైళ్లలో అందించే తాగునీటి బాటిళ్ల తయారీ ప్లాంటును విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. న్యూఢిల్లీ తరహాలో ప్రయాణీకుల సౌకర్యార్థం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ను ఏర్పాటు చేయనున్నారు. రైల్వేకు సంబంధించిన పనుల్లో యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని వరంగల్ జిల్లాలోని ఖాజీపేటలో నెలకొల్పాలని నిర్ణయించారు.
సికింద్రాబాద్లోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్లో రైల్వే నిధులు, ఖాతాలకు సంబంధించి వృత్తిపరమైన నిర్వహణ నైపుణ్యాన్ని నిరంతరం అందించేందుకు ఒక కేంద్రీకృత శిక్షణా సంస్థను ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఐఆర్ఐఎఫ్ఎం) పేర ఏర్పర్చాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి పవన్కుమార్ బన్సల్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
మన రాష్ట్రానికి జరిగిన కేటాయింపులను చూస్తే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. తన నియోజకవర్గంలో రైళ్ల మరమ్మత్తుల వర్క్షాపును ఏర్పాటు చేసుకుంటున్న ఆయన ఒక ఎక్స్ప్రెస్ రైలును, ఒక ప్యాసింజర్ రైలును కూడా వేసుకున్నారు. అలాగే, రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రాంతానికి, ఉత్తరాంధ్రకు కూడా సముచితమైన రీతిలో ప్రాజెక్టులు, రైళ్లు కేటాయించారు. అలాగే, విశాఖపట్నం నుంచి కొత్తగా మూడు ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రకటించగా, మరో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగించారు. కేంద్ర మంత్రిగా అన్ని ప్రాంతాలూ తనకు సమానమేనని సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.
ఫలించిన గుజరాత్ తెలుగు ప్రజల స్పప్నం
గుజరాత్లోని కచ్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు ప్రజల 30 ఏళ్ల కల ఫలించింది. రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వేలాది కుటుంబాలు గుజరాత్కు తరలివెళ్లాయి. దాదాపు 70 వేల మంది అక్కడ నివశిస్తున్నారు. గాంధీధామ్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రయాణించేందుకు నేరుగా ఒక రైలు వేయాలని వారు మూడు దశాబ్ధాలుగా పోరాడుతున్నారు. ఆ ప్రాంత ప్రజల తరపున తెలుగు సంఘం కొంత కాలం కిందట ఢిల్లీ వచ్చి జంతర్మంతర్ వద్ద ధర్నా జరిపింది.
రైల్వే మంత్రులు బన్సల్, సూర్యప్రకాశ్ రెడ్డి, ఆధిర్రంజన్ చౌదరిలతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలందరినీ వీరు కలిసి రైలు కోసం విజ్ఞప్తి చేశారు. నేతల హామీలు సఫలమై గాంధీధామ్ నుంచి విశాఖపట్నం వరకు వారు డిమాండ్ చేసిన స్టేషన్ల మీదుగా వారానికి ఒకసారి ఎక్స్ప్రెస్ రైలును నడుపుతామని బన్సల్ ప్రకటించారు.
బెంగుళూరు నుంచి గౌహతికి
కొద్ది నెలల కిందట బెంగుళూరులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు ప్రయాణించేందుకు సరిపడా రైళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించేలా కామాఖ్య(గౌహతి)-బెంగుళూరు రైలును వారాకిని ఒకసారి నడుపుతామని బన్సల్ ప్రకటించారు.
ఎక్స్ప్రెస్ రైళ్లు - 13
# చెన్నై-నాగర్సోల్ (సాయినగర్ షిర్డీ) ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి. వయా రేణిగుంట, డోన్, కాచిగూడ
# గాంధీధామ్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి. వయా అహ్మదాబాద్, వార్దా, బలార్ష, విజయవాడ
# హౌరా-చెన్నై ఏసీ ఎక్స్ప్రెస్.. వారానికి రెండుసార్లు. వయా భద్రక్, దువ్వాడ, గుంటూరు
# జబల్పూర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి. వయా నాగ్పూర్, ధర్మవరం
# కాకినాడ-ముంబై ఎక్స్ప్రెస్.. వారానికి రెండుసార్లు.
# కర్నూల్ టౌన్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్.. ప్రతిరోజూ.
# మంగళూరు-కాచిగూడ ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి. వయా డోన్, గుత్తి, రేణిగుంట, కోయంబత్తూరు
# నిజామాబాద్-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి.
# తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్.. వారానికి రెండుసార్లు.
# తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి. వయా విశాఖపట్నం
# విశాఖపట్నం-జోధ్పూర్ ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి. వయా తీత్లాఘర్, రాయ్పూర్
# విశాఖపట్నం-కొల్లాం ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి
# కామాఖ్య (గౌహతి) - బెంగళూరు ఏసీ ఎక్స్ప్రెస్.. వారానికి ఒకసారి.
కొత్తలైన్లు - 4
# చిక్బళ్లాపూర్-పుట్టపర్తి-శ్రీసత్యసాయి నిలయం
# కొండపల్లి-కొత్తగూడెం
# మణుగూరు-రామగుండం
# శ్రీనివాసపురం-మదనపల్లి
కొత్తలైన్ల నిర్మాణానికి సర్వేలు - 4
# మంచిర్యాల-ఆదిలాబాద్ వయా ఉట్నూరు
# సిద్ధిపేట-అ క్కన్నపేట
# సూర్జాఘర్-బీజాపూర్ వయా భోపాల్పట్నం
# వాషిం-మహుర్-ఆదిలాబాద్
డబ్లింగ్కు సర్వేలు - 4
# ధర్మవరం-పాకాల
# మహబూబ్నగర్-గుత్తి
# సికింద్రాబాద్-మడ్ఖేడ్-ఆదిలాబాద్
# తిరుపతి-కాడ్పాడి
ప్యాసింజర్ రైళ్లు - 1
# నంద్యాల-కర్నూల్ టౌన్. ప్రతిరోజూ.
మెము రైళ్లు - 1
# చెన్నై-తిరుపతి
రైళ్ల పొడిగింపు - 4
# హైదరాబాద్-దర్భంగ ఎక్స్ప్రెస్.. రక్సల్ వరకు
# హైదరాబాద్-బెల్లంపల్లి ఎక్స్ప్రెస్.. సిర్పూర్ ఖాగజ్నగర్ వరకు
# ఫల్నుమా-భువనగిరి మెమొ.. జనగామ వరకు
# మిర్యాలగూడ-నడికుడి దెమొ.. పిడుగురాళ్ల వరకు
రాకపోకల పొడిగింపు - 5
# కోయంబత్తూరు-తిరుపతి ఎక్స్ప్రెస్.. వారానికి మూడు నుంచి నాలుగు రోజులు
# నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్ప్రెస్.. వారానికి రెండు రోజుల నుంచి ఏడు రోజులు
# విశాఖపట్నం-హజూర్సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్.. వారానికి రెండు నుంచి మూడు రోజులు
# విశాఖపట్నం-లోకమన్య తిలక్ ఎక్స్ప్రెస్.. వారానికి రెండు నుంచి మూడు రోజులు
# సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్ప్రెస్.. వారానికి మూడు నుంచి ఏడు రోజులు
ఈ ఏడాది పూర్తి కానున్న కొత్త లైన్లు - 3
# దేవరకద్ర-కృష్ణ లైనులో కొంత భాగం
# మరికెల్-మక్తల్
# రాయదుర్గ-అవులదత్త
ఈ ఏడాది పూర్తి కానున్న డబ్లింగ్ ప్రాజెక్టులు - 5
# కోరుకొండ-అలమంద-కంతకపల్లి
# కోస్గి-మంత్రాలయం
# మంచిర్యాల-మందమర్రి
# సింహాచలం నార్త్-గోపాలపట్నం బైపాస్ లైన్
# వెంకటాచలం-నిడిగుంపపాలెం
ఈ ఏడాది పూర్తి కానున్న విద్యుద్దీకరణ మార్గాలు - 2
# కొండాపురం-వేములపాడు
# గుత్తి-తాడిచెర్ల
ఈ ఏడాది పూర్తి కానున్న కొత్తలైన్లు - 2
# కడప-పెండ్లమర్రి
# మోర్తాడ్-ఆర్మూర్-నిజామాబాద్
2013-14లో డబ్లింగ్ పనులు కానున్న సెక్షన్లు - 3
# నిడిగుంటపాలెం-కృష్ణపట్నం
# రాఘవాపురం-పెద్దంపేట
# సింహాచలం-గోపాలపట్నం బైపాస్ డబ్లింగ్












Click it and Unblock the Notifications