కోర్టులో లొంగిపోయిన జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి
రవీంద్రనాథ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో ఆయన సాయంత్రం దాకా ఆయన సహకార శాఖ అధికారులను నిలదీస్తూ హడానిడి చేశారు. అంతలోనే ఆయన మాయమయ్యారు. ఆయనపై నమోదైన ఫోర్జరీ, చీటింగ్ కేసులు కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించడమే అందుకు కారణమని వార్తలు వచ్చాయి. పిటిషన్ను కోర్టు కొట్టివేసిన వెంటనే పోలీసులు రవీంద్రనాథ రెడ్డి అరెస్టుకు రంగంలోకి దిగారని అయితే, ఆయన వారికి చిక్కలేదు.
కడప జిల్లా సహకార శాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆయన కార్యాలయం పేరిట స్టాంపు తయారుచేసి వాడుకున్నారనే ఆరోపణలపై రవీంద్రనాథ రెడ్డిపై కేసు నమోదైంది. సహకార ఎన్నికల సందర్భంగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెద్దచెప్పలి సొసైటీ పరిధిలో తెలుగుదేశం, కాంగ్రెస్లు కుమ్మక్కై బోగస్ ఓటర్లను నమోదు చేశాయంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
దీనిపై రవీంద్రనాథ రెడ్డి జిల్లా సహకార శాఖ అధికారికి డిసెంబర్ నెలాఖరులో (డీసీవో) తాము ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. డీసీవో సంతకం, కార్యాలయ స్టాంపుతో కూడిన జిరాక్సు పత్రాలను స్థానిక సహకార అధికారులకు అందించారు. దీని ఆధారంగా స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే, అప్పటికే అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగిసినందున, దీనిపై విచారణ జరుపుతారంటూ టిడిపి అధికారులు ప్రశ్నించారు.
ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. రవీంద్రనాథ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్న సంతకం, సీలు తమవి కావని డీసీవో చంద్రశేఖర్ స్పష్టం చేశారు. జనవరి 12న ఆయన ఫిర్యాదు జిరాక్స్ కాపీలు మాత్రమే తనకు అందించారని, వాటిని పరిశీలించినప్పుడు సంతకం, సీలు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దీంతో తెలుగుదేశం నాయకులు రవీంద్రనాథ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై ఐపీసీ 420, 468, 471, 473 సెక్షన్ల కింద కడప వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ కేసులను కొట్టివేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆపాలంటూ రవీంద్ర నాథ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కడప పోలీసులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని పదిహేను రోజుల క్రితం స్పష్టం చేసింది. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి తనను అరెస్టు చేయవచ్చుననే అనుమానంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన కోర్టులో లొంగిపోయారు.