గాలి బెయిల్ స్కాం: నలుగురికి సుప్రీం కోర్టు నోటీసులు
సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పట్టాభి రామారావు లాకర్లలో అవినీతి సొమ్ము రూ.2.72 కోట్లు పట్టుబడినట్లు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. లాకర్ తాళాలు పట్టాభి ఇంట్లో దొరికాయని, కేసులో మాజీ జడ్జి చలపతి రావు, గాలి సోదరుడు సోమశేఖర రెడ్డి ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. మరో నలుగురి పాత్ర ఇందులో ఉందన్నారు.
అక్రమ గనుల ద్వారా వేల కోట్లు సంపాదించిన గాలి జనార్దన్రెడ్డి బెయిల్ కోసం సిబిఐ కోర్టు జడ్జికి లంచం ఇచ్చారని కోర్టుకు వివరించారు. ఇది చాలా తీవ్రమైన నేరమని వాదించారు. ఈ సందర్భంగా.. డబ్బు తీసుకునే వాళ్లుంటే ఇచ్చేవాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని జడ్జి పట్టాభి రామారావును ఉద్దేశించి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణకు అవసరమైన నిందితులు ఎవరెవరో చెప్పాలని జస్టిస్ ఠాకూర్ అడిగారు.
గాలి జనార్దన్రెడ్డి, పట్టాభి రామారావు, చలపతి రావు, సోమశేఖర రెడ్డిలు తమకు అవసరమైన నిందితులని హరేన్ రావల్ సమాధానమిచ్చారు. దీంతో కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆ నలుగురికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.