నిరూపిస్తే దేనికైనా రెడీ: బాబ్లీపై ఎర్రబెల్లి సవాల్
బాబ్లీ అంశం నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ ఫోరం శుక్రవారంనాడిక్కడ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎడారిగా మారకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టును (ఎస్పారెస్పీని) కాపాడేందుకు ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన ఎస్సారెస్పీ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 7వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ ముందు, 8వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్ కార్యాలయాల ముందు, 9వ తేదీన నల్లగొండ, వరంగల్ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు. రైతు సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకుని తాము ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు.