ఉత్తమ వారసత్వం నగరంగా వరంగల్: చిరంజీవి
ఆ దిశగా ఆయన ముందడుగు వేశారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు కేటాయించే ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన వరంగల్కు తాజాగా ఈ అపూర్వమైన గౌరవాన్ని అందించారు. ఈ గుర్తింపుతో ఓరుగల్లులోని కాకతీయుల కోట, వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం తదితర ప్రాంతాలకు మంచి రాణింపు వస్తుంది. పెద్దఎత్తున విడుదలయ్యే నిధులతో పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా కొత్త హంగులు సమకూర్చడానికి వీలవుతుంది. వీటితోపాటు నగరంలో సరికొత్త పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, ప్రత్యేకంగా అందించే నిధులతో అభివృద్ధిపరుస్తారు.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా జిల్లా కేంద్రానికి అందుతాయని అధికారులు తెలిపారు. వరంగల్ను ఉత్తమ వారసత్వ నగరంగా ప్రకటించడంపై ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఢిల్లీలోని తన నివాసంలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి, రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ జిల్లా మంత్రులు కూడా ఈ గుర్తింపు పట్ల సంతోషం వెలిబుచ్చారు. రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.