మైనర్ బాలికతో బలవంతపు పెళ్లి: సూడానీ టెక్కీ అరెస్టు
సూడాన్లోని ఓ పెట్రోలియం కంపెనీలో ప్రాజెక్టు ఇంజనీర్గా పనిచేస్తున్న నిందితుడు ఒసామా ఇబ్రాహిం ఓ మిత్రుడి సలహా మేరకు హైదరాబాదు వచ్చాడు. హైదరాబాద్ అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని మిత్రుడు చెప్పడంతో అతను వచ్చాడు. ఆ అమ్మాయితో పెళ్లికి రెండు లక్షల రూపాయల ఇవ్వడానికి ఇబ్రహీం అంగీకరించాడు.
ఫిబ్రవరి 19వ తేదీన హైదరాబాద్ వచ్చిన ఇబ్రహీంకు ముంతాజ్ బేగం అనే మహిళ పెళ్లికి నలుగురు అమ్మాయిలను చూపించిందని, వారిలో 17 ఏళ్ల బాలికను ఇబ్రహీం ఎంపిక చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తితో బాలిక పెళ్లికి నిరాకరించినప్పటికీ ముంతాజ్ బేగం అమ్మాయి కుటుంబ సభ్యులను ఒప్పించిందని పోలీసులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 21వ తేదీన కుటుంబ సభ్యులు అతనితో అమ్మాయికి పెళ్లి జరిపించారు. గత రాత్రి అమ్మాయి తప్పించుకుని వచ్చి మొఘల్పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు వయో ధ్రువీకరణ పత్రం సృష్టించి అమ్మాయి మైనర్ తీరిపోయిందని చెప్పడానికి ఇబ్రహీంతో పాటు ఇతరులు ప్రయత్నించారు.
లక్ష రూపాయలు తీసుకుని మొహమ్మద్ హసన్ అనే వ్యక్తి కాంట్రాక్టు పెళ్లికి ఒప్పందం కుదిరించినట్లు సమాచారం. మొహమ్మద్ హసన్తో పాటు ఖాజీ మొహమ్మద్ నసీరుద్దీన్ను, ముంతాజ్ బేగంను పోలీసులు అరెస్టు చేశారు.