మనం పైకొస్తున్నాం: రోజా, జగన్ పార్టీ ఆఫీస్లో సందడి
ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు విజయమ్మ సన్మానం చేశారు. మహిళా నాయకులు ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. గతంలో రాజకీయాల్లో కేవలం మగవారు మాత్రమే పైకి వచ్చే వారని, ఇటీవల మహిళలు పైకి రావడం మహిళలు సాధించిన విజయమన్నారు. మహిళలు మరింత ముందుకు వెళ్లాలన్నారు.
మహిళలు తిరగొద్దని బొత్స చెప్పారు
మహిళలు అర్ధరాత్రి తిరగవద్దని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పడం విడ్డూరమని వైయస్ విజయమ్మ అన్నారు. మహిళల సాధికారత కోసం వైయస్ రాజశేఖర రెడ్డి తపించారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారని, ప్రతి మహిళను లక్షాధికారి చేయాలని తపించారన్నారు. ఆయన మరణం తర్వాత పథకాలు అటకెక్కాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా లేదని విమర్శించారు.
అంగన్ వాడి వారిని గుర్రాలతో తొక్కించిన ఘనత బాబుదే అన్నారు. వైయస్ వారసుడిగా ఆయన పథకాలను తన తనయుడు వైయస్ జగన్ అధికారంలోకి వస్తే అమలు చేస్తారని చెప్పారు. అందరం జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని సూచించారు.
మహిళలకు పటిష్ట భద్రత
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి వేరుగా చెప్పారు. నెక్లెస్ రోడ్డులో యువజన కాంగ్రెసు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మానహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
నిర్భయ పెట్రోలింగ్ వాహనం
మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ కార్తికేయ శుక్రవారం నిర్భయ పెట్రోలింగ్ వాహనాన్ని ప్రారంభించారు. మహిళల కోసం మహిళా పోలీసులతో నిర్భయ పెట్రోలింగ్ వాహనం ఉంటుంది.
మహిళలకు రక్షణ లేదు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మరో ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో షర్మిల అన్నారు. మహిళలకు ప్రయోజనాలు చేకూరుస్తామని కాంగ్రెసు పెద్దలు డబ్బులు దోచుకుంటున్నారని, చంద్రబాబు కూడా అదే దారిలో అప్పుడు నడిచారని ఆరోపించారు.
ఎన్ని మహిళా దినోత్సవాలు వచ్చినా లాభం లేదు
మహిళలకు రక్షణ లేకుండా పోతోందని తెరాస మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. ప్రతిరోజు మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఇలాంటప్పుడు ఎన్ని మహిళా దినోత్సవాలు వచ్చినా లాభం లేదన్నారు.
నిర్భయకు స్త్రీ శక్తి అవార్డు
గతేడాది డిసెంబరు నెలలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు స్త్రీశక్తి అవార్డును ప్రకటించారు.