అనిల్ జైలు పాలవద్దనే: సోమిరెడ్డి, వక్రభాష్యం: జూపూడి
కాంగ్రెసుకు మద్దతిస్తామని వైయస్ విజయమ్మ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెసు నుంచి ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఆయన అడిగారు. మడమ తిప్పం, కడప పౌరుషమంటూ ఆనాడు చెప్పి ఇప్పుడేమో కాంగ్రెసు మద్దతిస్తామని అంటున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేసిందని, ఎఫ్డిఐలపై ఓటింగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సబ్బం హరి కాంగ్రెసుకు మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు.
తమ నేత వైయస్ విజయమ్మ ఇంటర్వ్యూకు తప్పుడు భాష్యం చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర రావు, మూలింటి మారెప్ప విమర్శించారు. చెరసాలలు, నిర్బంధాలతో తమ పార్టీ ప్రభంజనాన్ని ఆపలేరని వారు మంగళవారం ఢిల్లీలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో అన్నారు. ప్రజాబలంతో తమ పార్టీ ముందుకు దూసుకుపోతుందని వారు చెప్పారు.
పురిటిలోనే తమ పార్టీ గొంతు నులమాలని చూశారని, రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందం ఉందని వారు విమర్శించారు. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదని వారన్నారు.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించాలని వారు సూచించారు. ఏ పార్టీతోనూ కలవాల్సిన అవసరం తమకు లేదని వారు స్పష్టం చేశారు.