బ్రహ్మానంద రెడ్డి నుంచి చిరు దాకా, జగన్ అంతే: బాబు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసులో విలీనంచేసే దిశగా ఎత్తుగడలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం పెద అమిరం గ్రామంలో సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. భీమవరం క్రాస్రోడ్స్, విస్సాకోడేరు, గొరగనమూడి, పాలకోడేరు మార్కెట్యార్డ్ వరకు నడిచారు. అంతకుముందు చింతలపూడి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడారు. విజయమ్మ ఇంటర్వ్యూ సారాంశాన్ని ఆయన ప్రజలలకు వివరించారు.
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ విలీనం కాక తప్పదని తాను మొదటి నుచీ చెబుతూనే ఉన్నానని, ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఒకే గూటికి చేరుకోవడం ఖాయమని తేలిపోయిందని ఆయన అన్నారు. '2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు సహకరిస్తాం' అనే విజయమ్మ మాటల్లో అంతరార్థం ఏమిటనేది గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ను కేసుల నుంచి బయటపడేసేందుకు తొలినుంచీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారని ఇప్పుడు అదే విషయం రట్టయిందని విమర్శించారు.
పాదయాత్రలో భాగంగా ఆయన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కలుసుకున్నారు. "సార్.. లోకేశ్కి తెలుగు యువత విభాగం బాధ్యతలు ఎందుకు అప్పగించరు?'' అంటూ విద్యార్థులు ప్రశ్నించగా, నవ్వి ఊరుకున్నారు. మార్గమధ్యంలో చిన్నాచితకా వ్యాపారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆశలు ఉండొచ్చుగానీ పార్టీపరంగా అందరూ ఎన్నికలకు సమాయత్తం కావాలని, ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. నియోజకవర్గ ఇన్చార్జిలనే అభ్యర్థులుగా ప్రకటిస్తామని, ఎక్కడైనా ప్రజా వ్యతిరేకత వస్తే కొత్తవారికి అవకాశం ఇస్తామని అన్నారు.