దుస్థితి: గుంటూరు ఆస్పత్రిలో రోగిని కొరికిన ఎలుకలు
తాజాగా సోమవారం మరోసారి ఎలుకలు పూర్ణమ్మ కుడి, ఎడమ అరికాళ్లను రక్తం వచ్చేలా రక్కాయి. కొంత భాగాన్ని తినేశాయి. దీన్ని గమనించిన బంధువులు మరోసారి అధికారులకు, వైద్యులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించాల్సిన అధికారులు తిరిగి రోగి బంధువులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా లేకుండా ఏం చేస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సూపరింటెండెంట్ చల్లా మోహనరావును వివరణ కోరగా స్పందించలేదు.
అయితే, చివరకు మోహనరావు వైద్యులను అప్రమత్తం చేశారు. వార్డును సందర్శించి పారిశుధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని పరీక్షించి, తగిన చికిత్స అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
వార్డును శుభ్రంగా ఉంచనందుకు పారామెడికల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని చల్లా మోహనరావు హామీ ఇచ్చారు. సరైన నిధులు విడుదల చేయడం లేదని వైద్యులు, నర్సులు ఆస్పత్రి అధికార యంత్రాంగంపై మండి పడుతున్నారు. అవసరం లేని చోటు డబ్బులు ఖర్చు చేస్తూ, అవసరం ఉన్న చోట పెట్టడం లేదని వారంటున్నారు.
గతంలోనూ ఇలాగే జరిగింది...
గతంలోనూ ఇదే తరహా సంఘటనలు జీజీహెచ్లో చోటు చేసుకున్నాయి. అప్పట్లో వీటిపై బాధితులు సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎలుకల నివారణకు ఏం చేయాలంటూ ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరారు. అయితే ఇంజనీరింగ్ అధికారులు ఎలుకల నివారణకు రూ. 7 కోట్లు ఖర్చవుతాయంటూ ప్రతిపాదనలు పెట్టారు. దీంతో సూపరింటెండెంట్ ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.