అవిశ్వాసం: హరీష్ ప్రశ్న, పయ్యావుల ఘాటు రిప్లై
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర నుంచి దృష్టి మళ్లించడానికే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెరాస నిర్ణయం తీసుకుందని, గతంలో తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పుడు అందరినీ సంప్రదించామని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రజల దృష్టిని ఆకర్షించడంలో తెరాస విఫలమైందని ఆయన విమర్శించారు. ఏ అంశంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారనే విషయంపై తెరాసకు స్పష్టత లేదని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, కాంగ్రెసు ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుతోందని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు విమర్శించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని తొడలు కొట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్ కాంగ్రెసుకు రబ్బర్ స్టాంప్గా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తామని సిపిఐ శానససభ్యుడు గుండా మల్లేష్ చెప్పారు.
గవర్నర్ ప్రసంగంపై తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. గత 12 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క మాట కూడా లేకపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. తెలంగాణ నిధులతో ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకు సోకులు, విశాఖకు మెరుగులు దిద్దుతున్నారని ఆయన విమర్శించారు.
హిట్లర్ రాజ్యంగా, నియంతృత్వ రాజ్యంగా కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే నైతిక అర్హత కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ తాను మొండినని అంటున్నారని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మొండితనం ఉండాలని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తొండి చేస్తున్నారని ఆయన అన్నారు.
పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు అని మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గారని, చంద్రబాబుది ఏ కాంగ్రెసు పార్టీ అని జూపల్లి కష్ణారావు అన్నారు.