జగన్తో పెద్దిరెడ్డి భేటీ: వైయస్సార్సిపిలోకి లైన్ క్లియర్
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని, ఇందుకు జగన్ నుంచి అనుమతి లభించిందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయానికి తాను కృషి చేస్తానని భేటీ అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.
కిరణ్ కుమార్ రెడ్డిని మొదటి నుంచి పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. కాంగ్రెసు ప్రాథమికి సభ్యత్వానికి, పిసిసి ఉపాధ్యక్ష పదవికి, ఎఐసిసి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు, పిసిసి అధ్యక్షుడుూ బొత్స సత్యనారాయణకు పంపించారు.
ఏ సంబంధం లేకున్నా జగన్ను జైలులో పెట్టారని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. త్వరలోనే జైలు నుంచి జగన్ బయటకు వస్తారని ఆయన అన్నారు. వచ్చేనెలలో తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని ఆయన చెప్పారు.