ఫస్ట్ డే: సభలో మజ్లిస్ మౌనం!, ఎవరి కండువా వారు...
అయితే, ఇటీవల కాంగ్రెసు పార్టీతో దోస్తీ తెంచుకున్న మజ్లిస్ పార్టీ మాత్రం అంతగా స్పందించలేదు. ప్రభుత్వంపై మజ్లిస్ పార్టీకి పీకల దాకా కోపం ఉన్న విషయం తెలిసిందే. దానినంతా ఓర్చుకొన్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మిగిలిన విపక్షాల్లా అడ్డుకునే ప్రయత్నాలు అంతగా చేయలేదు.
అసదుద్దీన్ తేల్చుతాడు
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ పార్టీలైనా అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ ఏం చేయాలనే విషయమై తమ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయిస్తారని పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు.
ఎవరి రంగుల్లో వారు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన బుధవారం వివిధ పార్టీల సభ్యులు వారి పార్టీ రంగులను ప్రతిబింబించేలా దుస్తులు, కండువాలు ధరించి సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఎక్కువ మంది తెలుపు రంగు దుస్తులు ధరించి, మెడలో మూడు రంగుల కండువా వేసుకున్నారు. టిడిపి మహిళా సభ్యులు పసుపు రంగు చీరలు ధరించగా.. పురుష సభ్యులు పసుపు చొక్కాలు వేసుకొచ్చారు. వీరంతా మెడలో పసుపు కండువాలు ధరించారు.
తెరాస సభ్యులు గులాబీ కండువాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వారి పార్టీ కండువాలను మెడలో ధరించారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కాషాయ లాల్చీ ధరించి వచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుపు రంగు దుస్తులు ధరించి, మెడలో పార్టీ కండువా వేసుకొచ్చారు. మజ్లిస్ సభ్యులు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ సాధారణ దుస్తులతో సభకు వచ్చారు. వామపక్షాల సభ్యులు ఎరుపు రంగు చొక్కాలు వేసుకున్నారు. సిపిఐ మహిళా ఎమ్మెల్యే చంద్రావతి ఎరుపు రంగు చుడీదార్ వేసుకొని టోపీ పెట్టుకున్నారు.