రివర్స్: బాబు వ్యూహంతో జగన్, కెసిఆర్ బొక్క బోర్లా?
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? లేక చారిత్రక తప్పిదం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇప్పడు పలువురు మదిని తొలుస్తోంది. సమావేశాలకు ముందు వరకు అవిశ్వాసంపై వైయస్సార్ కాంగ్రెసు, తెదేపా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు హఠాత్తుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాము అవిశ్వాసం పెడుతామంటూ ముందుకు వచ్చారు.
అదే సమయంలో జగన్ పార్టీ కూడా వేరుగా అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది. రెండు పార్టీలు అవిశ్వాసం పెడతామని చెప్పినా టిడిపి మాత్రం ఏ పార్టీకి మద్దతిచ్చేందుకు సమ్మతించలేదు. దీంతో, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి అధికార కాంగ్రెసు పార్టీతో లాలూచీ ఏర్పడిందా? అనే ప్రశ్న తలెత్తింది. అయితే, టిడిపి మాత్రం తాము సమయం వచ్చినప్పుడు అవిశ్వాసం పెడతామని, తోక పార్టీలకు మద్దతివ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాయి.
కానీ, అవిశ్వాసానికి దూరంగా ఉండటంతో టిడిపి అనుమాన భూతాలు కమ్ముకున్నాయి. కాంగ్రెసుతో కుమ్మక్కు మాట పక్కకు పెడితే.. టిడిపి ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కాలేదని, అందుకే అవిశ్వాసం విషయంలో వెనక్కి పోతోందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటోందని, అంతేకాకుండా తాము అవిశ్వాసానికి ముందుకు వస్తే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఢిల్లీ పెద్దలతో బేరాలు కూడా కొనసాగిస్తాయని టిడిపి వర్గాలు భావించి అవిశ్వాసంపై ఖరాఖండిగా చెప్పేశాయి.
అవిశ్వాసంకు మద్దతు ప్రకటించక పోవడం వ్యూహమని కొందరంటే... తప్పిదమని మరికొందరి వాదన. అయితే, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉద్దేశ్యం ఉంటే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒక్కటిగా అవిశ్వాస తీర్మానం ఎందుకివ్వలేదని టిడిపి ప్రశ్నిస్తోంది. ఈ లాజిక్కు టిడిపికి ఒక్కసారిగా ప్రాణం పోసిందనే చెప్పవచ్చు. అవిశ్వాసంపై ఏం చెప్పినా టిడిపిపై అనుమానాలు వీడలేదు. కానీ, ప్రభుత్వంపై అవిశ్వాసం అంటూ టిడిపికి సవాళ్లు విసిరిన టిఆర్ఎస్, జగన్ పార్టీలు ఒక్కటై ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని టిడిపి లేవనెత్తిన ప్రశ్నతో ఇప్పుడు ఆ రెండు పార్టీలు బొక్క బోర్లా పడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.
మరోవైపు చంద్రబాబు అవిశ్వాసంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని హైదరాబాదుకు చెందిన సీనియర్ నేత పిఎల్ శ్రీనివాస్ తెరాస అవిశ్వాసానికి మద్దతు పలకడం లేదంటూ బుధవారం ఉదయం పార్టీకి రాజీనామా చేశారు. సాయంత్రానికల్లా బాబుతో మాట్లాడాక రాజీనామాను ఉపసంహరించుకున్నారు. పిఎల్ శ్రీనివాస్కు బాబు ఏం చెప్పారు? అవిశ్వాసం కోసమే రాజీనామా చేసిన పిఎల్.. దానిపై హామీ రావడంతోనే వెనక్కి తగ్గారా? అనే చర్చ సాగుతోంది.
అదే నిజమైతే.. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అవిశ్వాసం పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెరాస, జగన్ పార్టీల అవిశ్వాస తీర్మానంతో మొదట టిడిపి ఇరుకున పడ్డప్పటికీ వారు వేర్వేరుగా పెట్టారని అందులోని మర్మమేమిటో చెప్పాలని ప్రశ్నించడం ద్వారా ఒక్కసారిగా టిడిపిలో కొత్త ఉత్సాహం వచ్చింది. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు వేర్వేరుగా నోటీసులు ఇచ్చి టిడిపిలో కొత్త ఉత్సాహం నింపారని అంటున్నారు. అదే సమయంలో బాబు వ్యూహాత్మకంగా ఆ రెండు పార్టీలను పలుచన చేసేందుకు అవిశ్వాసాన్ని తెరమీదకు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
బతిమాలి అవిశ్వాసం..
అధికార కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు.. బలం లేని వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను బతిమాలి అవిశ్వాస తీర్మానం పెట్టించుకుందని టిడిపి నేత లింగారెడ్డి ఆరోపించారు. సభలో సమస్యల ప్రస్తావన లేకుండా ఉండేందుకే ఆ మూడు పార్టీలు కుమ్మక్కై ఇలా చేస్తున్నాయన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుంటే ప్రభుత్వం పడిపోతుందని, దానికి మేము కలిసి వస్తామని, మిగిలిన వారెవరు కలిసి వస్తారో చూద్దామన్నారు.