గంటల్లో పిఎల్ యుటర్న్: బాబుకి ఊరట, కెసిఆర్కి షాక్
అయితే, ఆ తర్వాత సాయంత్రానికల్లా ఆయన చల్లబడ్డారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పిఎల్ శ్రీనివాస్కు చంద్రబాబు ఫోన్ చేసి దాదాపు అరగంట మాట్లాడారు. తనతో బాబు మాట్లాడారని, బిసిలకు న్యాయం చేస్తానని చెప్పారని, అలాగే మిగతా సమస్యలు, అంశాల పైన స్పందిస్తానని తనకు చెప్పారని, అందుకే రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు పిఎల్ శ్రీనివాస్ చెప్పారు.
బాబుతో ఫోన్లో మాట్లాడిన అనంతరం పిఎల్ శ్రీనివాస్ గంటల్లోనే వెనక్కి తగ్గారు. పిఎల్ టిడిపికి రాజీనామా చేసి, తమ పార్టీలోకి వస్తారని భావించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఆయన అనుకోకుండా యూ టర్న్ తీసుకోవడంతో షాక్కు గురైందట. నగరంలో మంచి పట్టున్న ఓ నేత తమ వైపు వస్తాడని భావించిన తెరాసకు ఇది ఊహించని షాకే అంటున్నారు.
కాగా, బుధవారం ఉదయం పిఎల్ శ్రీనివాస్ టిడిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా విషయాన్ని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబు వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం దారుణమని ఆయన అన్నారు. తోకపార్టీలతోనే చంద్రబాబు 2009 ఎన్నికల్లో ప్రయోజనం పొందారని ఆయన అన్నారు. చంద్రబాబుపై తెలంగాణ మీద మాట్లాడడు, అవిశ్వాస తీర్మానంపై మాట్లాడడు అని ఆయన అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోవడం వల్లనే తెలంగాణ ఆగిందని ఆయన విమర్శించారు. పార్టీ కార్యకర్తలను వాడుకుని చంద్రబాబు వదిలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారట అని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, నడిపించారని ఆయన అన్నారు. నామ్ కే వాస్తేగా తనకు చంద్రబాబు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆయన అన్నారు.
తమ వర్గాన్ని చంద్రబాబు దూరం చేసుకుంటున్నారని ఆయన అ్నారు. ఆల్లాడి రాజ్కుమార్ను, శ్రీపతి రాజేశ్వర్ను కూడా చంద్రబాబు సరిగా వాడుకోవడం లేదని ఆయన అన్నారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుగా మాట్లాడాలంటే తన వల్ల కాదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. సనత్నగర్ టికెట్ ఇచ్చి, ఉపసంహరించుకోవాలని చంద్రబాబు అడిగితే తాను ఉపసంహరించుకున్నానని, ఆలా ఉపసంహరించుకోనివారిని నియోజకవర్గాల ఇంచార్జీలుగా నియమించారని, తనను మాత్రం ఇంచార్జీగా నియమించలేదని ఆయన అన్నారు.
అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు ప్రతిపాదించరని, ఇతరులు పెడితే మద్దతు ఇవ్వరని, ఇదేం పద్ధతి అని ఆయన అన్నారు. డబ్బులు ఇవ్వలేకపోయినందుకే తనకు ఇంచార్జీ పదవి ఇవ్వలేదని ఆయన అన్నారు. అవినీతిపరులు డబ్బులు ఇస్తున్నారని, వారికే పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో మాట్లాడుతానని, కెసిఆర్కు మద్దతు ఇస్తానని ఆయన అన్నారు.
సోదరులుగా విడిపోదామనేది తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. హైదరాబాదులో రాయలసీమ, ఆంధ్రవాళ్లు తక్కువ మందే ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అగ్రనేతలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి తాను సరైన సమచారాం ఇస్తానని, తప్పుడు సమాచారం అందిస్తున్నారని చెబుతానని ఆయన అన్నారు.