ఏడో'సారీ': మళ్లీ గాలికి సిబిఐ కోర్టులో చుక్కెదురు
కాగా, గత వారం గాలి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ న్యాయస్థానంలో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. సిబిఐ తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటూ బెయిలును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని గాలి జనార్ధన్ తరఫు న్యాయవాది సిబిఐ న్యాయస్థానానికి చెప్పారు. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాలను గుర్తించాలని చెబుతోందని, సరిహద్దులు తేలకుండా దీన్ని ఎలా నిర్దారిస్తుందని ప్రశ్నించారు.
ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షకంటే ఎక్కువకాలం గాలిని జైల్లో ఉంచాలని సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ సంస్థ దర్యాఫ్తులోనే లోపాలున్నాయని, కర్నాటకలోని కేసులను ప్రస్తావిస్తూ ఇక్కడ బెయిలును అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన లీజుల్లో తవ్వకాలే జరపలేదని సిబిఐ చెబుతోందని, అలాంటప్పుడు అక్రమ మైనింగుకు అవకాశం ఎక్కడిదని వాదించారు. ఇరువైపుల వాదనల అనంతరం ఈ రోజు గాలి బెయిల్ పిటిషన్ను కోర్టు నిరాకరించింది.
శ్రవణ్ గుప్తాకు అనుమతి
ఎమ్మార్ ఎంజిఎఫ్ ఎండి శ్రవణ్ గుప్తాకు లండన్, దుబాయ్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు గురువారం అనుమతిని ఇచ్చింది. ఆరు లక్షల రూపాయల పూచికత్తును సమర్పించి విదేశీ పర్యటనకు వెళ్లాలని ఆదేశించింది.
రవీంద్రనాథ్ రెడ్డి కేసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి సత్యోశోధన పరీక్షలు జరిపేందుకు అనుమతివ్వాలని పోలీసులు కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు దీనిపై విచారణను ఈ నెల 19వ తేదికి వాయిదా వేసింది.