బాబులో మార్పు, జగన్ వలకు ముందే: కిరణ్ వ్యూహం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ అనుమానిస్తోంది. ఆ రెండు పార్టీల ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగకముందే వ్యూహాత్మకంగా త్వరగా అవిశ్వాసంపై చర్చ, ఓటింగు జరపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆలస్యమైతే తెలంగాణ సెంటిమెంట్, జగన్ ప్రభావం కారణంగా పలువురు వారి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోతుందని నిర్ధారణకు వస్తే కొందరు ఎమ్మెల్యేలు కిరణ్కు వ్యతిరేకంగా ఓటేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని అధికార పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా లేనని ప్రకటించింది.
టిడిపి మనసు మార్చుకోకముందే అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిపితే బాగుంటుందని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపి మనసు మార్చుకుంటే కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం ఆలపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు భావిస్తున్నారు.
మంత్రులకు బాధ్యత
ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓటింగులో పాల్గొనేలా చేసే బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు. మంత్రులంతా అందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగులో పాల్గొనేలా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.