కిరణ్ ప్రభుత్వంలో డిసిఎంగా బాబు చేరుతారు: కెటిఆర్

తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీలను కలుపుకుని రావడంలో తాము కృతకృత్యులయ్యామని ఆయన అన్నారు. తెలంగాణను చేర్చకుండా ఏకవాక్య తీర్మానం ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శను ఖండించారు. ప్రతిపక్షాల మధ్య వైరుధ్యాలున్నా, సిద్ధాంతపరమైన విభేదాలున్నా తెలంగాణ విషయంలోనే కాదు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో ఐక్యత అవసరమని, అందుకే తాము ఏక వాక్య తీర్మానం ప్రతిపాదించామని ఆయన అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విషయంలో అందరం ఒక్క తాటి మీదికి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని తొడగొడుతున్నారని, సందర్భం వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతున్నారని, ప్రభుత్వాన్ని పడగొడుదామంటే కలిసి రావడం లేదని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాకుండా చంద్రబాబు శైలి కూడా ప్రస్తావనకు వస్తుందని ఆయన అన్నారు.
బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి విస్తరణ ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, ఆ విస్తరణలో తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులు తీసుకుంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసులో విలీనానికి తమ పార్టీ కార్యకర్తలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని ఆయన అన్నారు. నిస్సిగ్గుగా చంద్రబాబు అవిశ్వాసానికి వ్యతిరేకింగా, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు బూటకం, మాటలు నాటకమని ఆయన అన్నారు. శానససభలో టిడిపి పాత్ర కూడా చర్చనీయాంశమవుతుందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు మాటలు కూడా ఒకే రకంగా ఉన్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెసులో విలీనమవుతుందనే తమ మాట నిజం కాదని నిరూపించాలంటే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కాకపోతే ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆయన తెలుగుదేశం పార్టీకి సూచించారు. ఒక్కసారి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత మరో ఆరు నెలల పాటు తిరిగి అవిశ్వాసం పెట్టడానికి వీలు కాదనే విషయం చంద్రబాబుకు తెలుసునని, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వీగిపోతే ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చునని అనుకుంటున్నారని ఆయన అన్నారు. అందరినీ కలుపుకుని వెళ్లడానికే తాము ఏకవాక్య తీర్మానం ప్రతిపాదించామని, తెలంగాణ సాధనే తమ ప్రథమ లక్ష్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications