నటి కవిత కూతురు పెళ్లి: చెలరేగుతున్న దుమారం
సినీ నటి, టీడీపీ మహిళా నేత కవిత కూతురు మాధురి కారు డ్రైవర్ను ప్రేమపెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ నటి కవితకు కుమార్తె మాధురి తన కారు డ్రైవర్ రాజ్కుమార్తో ప్రేమలో పడింది. ఈ ప్రేమ మరింత ముదిరి పోవడంతో వీరిద్దరు కరీంనగర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆలయానికి వెళ్లి, కొత్త దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మాధురిని హైదరాబాద్కు, రాజ్కుమార్ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన రాజ్కుమార్ అనే 28 యేళ్ళ యువకుడు గత మూడేళ్లుగా సికింద్రాబాద్లో ఉంటూ మాధురి కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఎంబీఏ చదువుతున్న మాధురిని కాలేజీకి తీసుకువెళుతున్న క్రమంలో ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో రెండు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన మాధురి గురువారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో రాజ్కుమార్తో కలిసి ప్రత్యక్షమయ్యారు. దళిత నేతల సమక్షంలో వెంకటేశ్వరాలయంలో వివాహం చేసుకున్నారు.
ఈ వ్యవహారంపై వధువు బంధువుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్లో రాజ్కుమార్పై కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు పెద్దపల్లికి వచ్చి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని, తన భర్తను వేధించవద్దని మాధురి పోలీసులను కోరుతోంది.