కెసిఆర్ మాటపై ఏమంటారు: తెరాసకు శ్రీధర్ ప్రశ్న
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని కెసిఆర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. తెరాస సభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యలపై ప్రతిస్పందన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శానససభలో ఒక్క వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడారని, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అనలేదని ఆయన స్పష్టం చేశారు. కాలర్ పట్టుకుంటే పనిచేయబోమని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ బాధ్యతగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వివరణ ఇచ్ఛారు. దాన్ని మరో రకంగా అన్వయించడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్ధి విషయంలో తాము రాజీపడబోమని ఆయన చెప్పారు. తమ శాసనసభ్యులు చేస్తున్న కృషితో, ముఖ్యమంత్రి అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అలాగే ప్రజల ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. తమది మైనారిటీ ప్రభుత్వం కాదని ఆయన అన్నారు.
సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య ఎంత ఉందో చూసి, ప్రతిపక్షాల సభ్యుల సంఖ్యతో కలిపి మొత్తం చూస్తే సంఖ్య ఎంతవుతుందో తెలుసునని, తమకు పది ఇరవై మంది శాసనసభ్యులు ఎక్కువగా ఉంటారని ఆయన అన్నారు. తమ పార్టీ విప్ను ధిక్కరించి, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. శ్రీధర్ బాబు మీడియా మాట్లాడుతున్నప్పుడు తెలంగాణకు చెందిన మరో మంత్రి బస్వరాజు సారయ్య కూడా పక్కనే ఉన్నారు.