ట్విస్టు: బెదిరించి పెళ్లి చేసుకున్నాడని కవిత కూతురు
కూల్ డ్రింక్ తాగిన తర్వాత తనను ఎక్కడికి తీసుకుని వెళ్లింది కూడా తనకు తెలియదని, గుడిలోకి తీసుకుని వెళ్లి బలవంతంగా తాళి కట్టాడని ఆమె చెప్పింది. పోలీసుల సహకారంతో తాను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నానని ఆమె చెప్పింది. ఫిర్యాదు చేసిన 24 గంటల లోపే తన కూతురుని ఇంటికి చేర్చిన పోలీసులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.
సినీ నటి కవిత కూతురు మాధురి కారు డ్రైవర్ను ప్రేమ వివాహంపై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. తాను తన కారు డ్రైవర్ రాజ్కుమార్ను ఇష్టప్రకారంగానే పెళ్లి చేసుకున్నానని, అందువల్ల తన భర్త రాజ్కుమార్ను వేధించవద్దని మాధురి పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. తామిద్దరం ప్రేమించుకున్నామని, ఈ ప్రేమ పెళ్లికి తమ ఇంటి పెద్దలు అంగీకరించక పోవడంతో తాను ఇష్టపడి ఇంటి నుంచి వెళ్లిపోయి ఆలయంలో వివాహం చేసుకున్నట్టు ఆమె పోలీసులకు చెప్పినట్లు అప్పుడు సమాచారం అందింది. అయితే, అకస్మాత్తుగా వివాదం మలుపు తిరిగింది.
ప్రేమ పెళ్లి విషయం తెలిసిన పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆలయానికి వెళ్లి, కొత్త దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మాధురిని హైదరాబాద్కు, రాజ్కుమార్ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన మాధురి గురువారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో రాజ్కుమార్తో కలిసి ప్రత్యక్షమయ్యారు. దళిత నేతల సమక్షంలో వెంకటేశ్వరాలయంలో వివాహం చేసుకున్నారు.