తాత ఎన్టీఆర్ అంతటివాడిని కాలేను: జూ ఎన్టీఆర్

బెజవాడ తనకు అత్యంత సన్నిహితమైన ప్రాంతమని, ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. తనను కూడా ఇక్కడా మీ ఇంట్లో బిడ్డగా అనుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని ఆయన కోరారు. అన్నగారిగా పిలిపించుకునే అర్హత తాతగారు ఎన్టీ రామారావుకు మాత్రమే ఉందని, తనను మీ తమ్ముడిగా చూస్తే చాలునని ఆయన అన్నారు. తాతగారికి జన్మనిచ్చిన నిమ్మకూరును, తనకు స్ఫూర్తినిచ్చిన విజయవాడను తాను మరిచిపోలేనని ఆయన అన్నారు.
కాగా, విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహించిన బ్రైడ్ ఆఫ్ ఇండియా నగల ఉత్సవం సీజన్ - 3 ప్రివ్యూ కోసం ఆ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ వచ్చారు. మహాత్మా గాంధీ రోడ్డులోని గేట్వే హోటల్ వద్ద అబిమానులకు ఆయన అభివాదం చేస్తూ సందడిగా గడిపారు. ఎన్టీఆర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.
ఎన్టీఆర్ విజయవాడ పర్యటనలో ఆయనకు, సీనియర్ ఎన్టీఆర్కు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే కనిపించాయి. బాలకృష్ణ ఫ్లెక్సీలు, బ్యానర్ల ఊసు లేదు. తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కూడా కనిపించలేదు. బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలపై కొంత మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ కట్టుకథలని వారు కొట్టిపారేశారు. నందమూరి కుటుంబంలో విభేదాలు ఉంటే వారు పరిష్కరించుకుంటారని మరి కొంత మంది అన్నారు. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన మరోసారి నందమూరి కుటుంబంలోని విభేదాలను రచ్చకీడ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications