ఎదురు తిరిగింది!: సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
వ్యవసాయ బడ్జెట్ పెట్టడంపై లోక్సత్తా అధ్యక్షుడు, కూకట్పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. వ్యవసాయ బడ్జెట్ అని తప్పుడు సమాచారం ఇచ్చి కార్యాచరణ ప్రవేశ పెట్టారని జెపి అన్నారు. లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యే గూండా మల్లేష్ మాట్లాడుతూ.. వ్యవసాయ బడ్జెట్ అని చెప్పి కార్యాచరణ ప్రకటిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కన్నాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు.
బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక ప్రవేశ పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక మొదటిసారి అయినందున కొంత అయోమయం ఏర్పడిందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వివరణ ఇచ్చారు.
చిత్తూరు బడ్జెట్
ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ చిత్తూరు బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. బడ్జెట్లో తొమ్మిది శాతం నిధులు చిత్తూరు జిల్లాకే తరలి వెళ్లాయన్నారు. బడ్జెట్లో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని విమర్సించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించేందుకు రూ.100 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వానికి చేతులు రాలేదన్నారు.
ఉభయ సభలు వాయిదా
బడ్జెట్ పైన విపక్ష సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చిన అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. శాసనమండలి కూడా ఎల్లుండికి వాయిదా పడింది.