తెలుగు టిడిపి: టిడిపి, కాంగ్రెస్ కండువాలతో జగన్ పార్టీ
రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెసు కలిసిపోయాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసిపోయి తెలుగు కాంగ్రెసుగా ఏర్పడ్డాయని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అధికార పక్షానికి ప్రతిపక్షం కొమ్ము కాస్తోందన్నారు.
తమ వ్యక్తిగత ప్రయోజనాలకే టిడిపి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. టిడిపి, కాంగ్రెసు పార్టీలవి ఒకే అజెండా అని ధ్వజమెత్తారు. సహకార, ఎమ్మెల్సీ, ఎఫ్డిఐలపై టిడిపి కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ప్రతి రెండు వందల కిలోమీటర్లకు ఒక నేత పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు టిడిపి నేతలు పెరిగిన ధరలను నిరసిస్తూ కూరగాయలతో నిరసన తెలిపారు.
నిత్యావసర వస్తుల ధరల పెరుగుదలను నిరసిస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో టిడిపి వంటా వార్పు కార్యక్రమం చేపట్టింది. ధరల నియంత్రణలో కిరణ్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తెరాస, టిడిపిలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో సభ్యులు ఆందోళన చేపట్టారు, పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను పది గంటల వరకు వాయిదా వేశారు.
ఎమ్మెల్యేలకు విజయమ్మ ఫోన్
అవిశ్వాస తీర్మానం సమయంలో మద్దతిచ్చిన తొమ్మిది మంది కాంగ్రెసు, ఆరుగురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్ విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. రాజన్న రాజ్యం తీసుకు వచ్చేందుకు కృషి చేద్దామని వారికి సూచించారు.