స్విస్ వనితపై రేప్: టూరిజం మంత్రి చిరంజీవి ఫైర్
హైదరాబాద్: స్విస్ వనితపై గ్యాంగ్ రేప్ ఉదంతం కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ప్రయత్నాలకు దెబ్బగా పరిణమించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన మచ్చగా మారినట్లు ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్కు లేఖ రాశారు.
విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం దారుణమని చిరంజీవి ఒక ప్రకటనలో అన్నారు. ఇలాంటి సంఘటనలు దేశ ప్రతిష్టను మంటగలుపుతాయని ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలికి అన్నివిధాలా సహాయం అందించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్, డీజీపీలను మంత్రి ఫోన్ద్వారా కోరినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
అలాగే ఆమెకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్విస్ రాయబారి లైనస్వాన్ క్యాజిల్మర్కూ ఫోన్లో హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఆ దంపతులు దేశంలో ఉన్నంత కాలం ప్రభుత్వ రంగ స్టార్ హోటళ్లలో బస, రవాణా తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
భారత్లో విదేశీ పర్యాటకుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉందని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలతో భేటీ ఏర్పాటుకు హోంమంత్రి షిండేను కోరనున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.