స్థానికానికి రెడీ కండి: సిఎం, ఎమ్మెల్యేల అనర్హతపై బొత్స
సిఎల్బీ సమావేశానికి 34 మంది మంత్రులు, 65 మంది శాసనసభ్యులు, 25 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శానససభలో ప్రతిపక్షాల దాడిని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, త్వరలోనే విద్యుత్ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గాలకు నిధులు విడుదల చేస్తున్నామని కిరణ్ కుమార రెడ్డి చెప్పారు.
పార్టీ విప్ను ధిక్కరించిన శాసనసభ్యులపై అనర్హత వేటు విషయాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లా పర్యటనల్లో మంత్రులు తప్పనిసరిగా డిసిసి కార్యాలయాలకు రావాలని ఆయన సూచించారు. పార్టీ మండల కమిటీలను వేయాలని, వీటిలో 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారినే వేయాలని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే రచ్చబండ పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీలో ఉన్న ఇంటి దొంగల పని పట్టాలని శానససభ్యుడు బిక్షమయ్య అన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సిఎల్పీ సమావేశంలో నిర్వహించారు. శాసనసభ ఆవరణలోనే కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారు.
మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రులు
సీనియర్ మంత్రులు జానా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, డిఎల్ రవీంద్రా రెడ్డి, డికె అరుణ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎవరు ఎందుకు అలా వెళ్లారనేది తెలియడం లేదు. డిఎల్ రవీంద్రా రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.